ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో ఇంకా కరోనా కేసులు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో రోజుల వ్యవధిలోనే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఈ రెండు నెలల్లోనే కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది. దీంతో అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
భారత్ కూడా కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వరుసగా రెండోరోజు కూడా జీరో మరణాలతో రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదు. కొత్తగా 49 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 37,492కు చేరింది. మొత్తం 337 యాక్టివ్ కేసులుండగా, వీరిలో 136 మంది హోం ఐసొలేషన్లో ఉన్నారు. గత 24 గంటల్లో 57 మంది డిశ్చార్చి అయ్యారు. దీంతో పూర్తి స్వస్థత చేకూరిన వారి సంఖ్య 36,536కు చేరింది.
మృతుల సంఖ్య 619 వద్దే రెండు రోజులుగా నిలిచి ఉండటం సానుకూల పరిణామం. చివరిగా ఈనెల 11న రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. కాగా, పుదుచ్చేరితో పాటు, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, లడఖ్, జార్ఖాండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, అసోం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనూ గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. కాగా దేశ వ్యాప్తంగా కరోనా రికవరే రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇంతవరకు ఏ దేశంలో నమోదు కాని రికవరీ రేటు ఇండియాలో ఉంది. ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనాను ఎదుర్కోవడం ఈజీ అవుతోందని వైద్యులు చెబుతున్నారు.