బీహార్లో ఎన్నికల హడావిడి ముగిసినా టెన్షన్ ఇంకా తగ్గలేదు. ఎన్నికల్లో ఎన్డీయే గెలిచినప్పటికీ ఇప్పుడు మాత్రం సందిగ్దత వీడడం లేదు. సీఎంగా నితీష్ కుమారే అని అందరూ అనుకుంటున్నా.. రాజకీయాలు ఏ విధంగా ఉంటాయన్నది బీహార్లో అందరినీ ఆలోచింపజేస్తోంది.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినా నితీష్ కుమార్ జేడీయూ కంటే.. బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో బీహార్ విషయంలో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. అయితే ఇదే సమయంలో నితీష్ మాత్రం నిరాశలోనే ఉన్నారు. ఎందుకంటే జేడీయూకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే ఆయన అనుకున్నది అనుకున్నట్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీ శాసించే స్థాయిలో ఉంది. దీపావళి తర్వాత బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన నితీష్.. బిహార్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరని అడిగిన ప్రశ్నకు వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారు.
కాబోయే సీఎం తానేనని ప్రకటించుకోకుండా, తాను ఈ విషయంపై ఏం చెప్పలేనని.. ఈ విషయంలో ఎన్డీయేదే అంతిమ నిర్ణయమని నితీష్ జవాబిచ్చారు. దీంతో ఎన్డీయే ఎలా చెబితే అలా చేస్తారన్నమాట. ఇక బీజేపీ మా సీఎం నితీషే అని ముందే ప్రకటించింది. ఇప్పుడు విజయం సాధించిన సీట్ల సంఖ్య పక్కకు పెడితే కచ్చితంగా నితీష్నే సీఎం చేయాల్సి ఉంటుంది. ఇక నితీష్ కూడా ఇవన్నీ మైండ్లో పెట్టుకొనే ఎన్డీయేదే నిర్ణయమని చెప్పి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.