ఇన్ని రోజులు కరోనా వైరస్ కేసుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ కేసుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూకేలో ప్రబలిన కరోనా స్ట్రెయిన్ వైరస్ ఇప్పుడు నెమ్మదిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. యూకే నుంచి ఇండియాకు వచ్చిన వారికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
స్ట్రెయిన్ వైరస్ రోగులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేయాలని ఢిల్లీ రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో 8మందికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 25 వతేదీ నుంచి డిసెంబరు 21వతేదీ వరకు యూకే నుంచి 13,000 మంది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో మొత్తం 19 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది.
విమానాశ్రయంలో జరిపిన పరీక్షల్లో 11 మందికి పాజిటవ్ అని వచ్చింది. మిగిలిన పాజిటివ్ కేసులు ఇంటింటి కరోనా సర్వేలో బయటపడ్డాయి. యూకే నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ అని వచ్చిన 19 మంది రోగులను ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తరలించి కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన యూకే వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. అనంతరం యూకే నుంచి వచ్చిన యువకుడి తండ్రికి కూడా కరోనా పాజిటివ్ అని వెల్లడైందని అధికారులు చెప్పారు.
దీంతో యూకే వాసి కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ చేశారు. డోర్ టు డోర్ సర్వేలో యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. యూకే నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి 13వేలమంది ప్రయాణికులు రాగా, వారిలో 1400 మంది ఢిల్లీ వాసులని పౌరవిమానయాన శాఖ అధికారులు చెప్పారు.