పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్న మాటను జగన్ సర్కారు నిలబెట్టుకుంటోంది.
ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి మరో ముందుడుగు పడింది. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ. 2050 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో ఏపీలో మరింత మంది విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం వచ్చింది.
సీఎం జగన్ వైద్య విద్య, పేద ప్రజల వైద్యంపై ప్రణాళికతో ముందుకు పోతున్నారు. డబ్బుకు వెనుకాడకుండా పేద ప్రజల ఆరోగ్యాల కోసమే ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో, విశాఖ జిల్లా పాడేరులో, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వీటన్నింటికి రూ. 500 కోట్లు కేటాయించింది.
ఇక పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల్లో చెరో వంద ఎంబీబీఎస్ సీట్లు మచిలీపట్నం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. అమలాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, మదనపల్లె, ఆదోని, పులివెందులలో కాలేజీలకు రూ. 104.17 కోట్లతో స్థలాలు కొనేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.