లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్లు గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తాము ప్రేమలో ఉన్నామని నేరుగా ఒక్కసారి కూడా చెప్పని ఈ జంట సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫొటోలతో హల్చల్ చేస్తోంది. ఇక వీరి వివాహం విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అధికారికంగా స్పందించలేదీ జంట. ఈ క్రమంలోనే వీరి పెళ్లి విషయంలో చాలాసార్లు పుకార్లు షికార్లు చేశాయి. ఒకానొక సమయంలో ఈ జంట విడిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలేనని తమ ఫొటోలతో తేల్చి చెప్పిందీ జంట.
ఇదిలా ఉంటే ఈ జంటకు సంబంధించి ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులో ఓ ఫామ్ హౌజ్లో నయనతార, విఘ్నేష్ వివాహం చేసుకోనున్నారనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కరోనా కారణంగా దొరికిన గ్యాప్లో పెళ్లి తంతు పూర్తి చేయాలని ఈ జంట భావిస్తోందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.