భారత్, చైనా సరిహద్దులో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు ఇప్పటికే పలు మార్లు కీలక సమావేశాలు నిర్వహించినా ఫలితం మాత్రం ఏమీ లేదరి అర్థమవుతోంది. అయితే సరిహద్దులో పరిస్థితులు మామూలు స్థితికి వస్తాయని అంచనా వేస్తున్న ప్రజలకు భద్రత రంగ నిపుణులు చేదు వార్త చెప్పారు.
చండీగఢ్ విశ్వవిద్యాలయం వర్చువల్ మీట్ నిర్వహించింది. ఇందులో భారత సైన్యం, నావికా దళం, భద్రతా రంగ నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. వారు ఏమన్నారంటే.. తూర్పు లద్దాక్ నుంచి వెళ్లేందుకు చైనా ఇష్టపడటం లేదన్నారు. చైనా సైన్యం మొండి పట్టు పడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య, మంత్రివర్గ స్థాయుల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ, చైనీస్ పీఎల్ఏ క్షేత్ర స్థాయి నుంచి వెనుకకు వెళ్ళడానికి, వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని కొనసాగించడానికి తిరస్కరిస్తోందన్నారు.
ఇరు దేశాలు సైన్యాన్ని బాగా మొహరించాయని తెలిపారు. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు ఎదురైనా తట్టుకునేందుకు వీలుగా ఇరు దేశాలు సిద్ధంగానే ఉన్నాయని అభిప్రాయం తెలిపారు. అయితే అన్నింటిలో భారత్ చైనా కంటే మెరుగ్గానే ఉందని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని స్థానిక సంఘటనలు ఉండవచ్చునని, అయితే అణ్వాయుధ సామర్థ్యంగల ఇరు దేశాలు పూర్తి స్థాయి యుద్ధాన్ని భరించలేవని అన్నారు. ఈ సందర్భంలో చైనా పీఎల్ఏ కన్నా భారత సైన్యానికి వ్యూహాత్మక సానుకూలత ఎక్కువగా ఉందని చెప్పారు.
భారత సైన్యానికి కఠినమైన చలికాలంలో అత్యంత ఎత్తయిన, కొండ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించిన అనుభవం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి సరిహద్దులో ఉద్రిక్తతలు చల్లబడుతున్నట్లు భావించిన వారందరికీ వాస్తవం తెలిసినట్లు అయ్యింది. ఎందుకంటే ఇరుదేశాల చర్చల్లో సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే అది జరగడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా చైనా తన వక్రబుద్దితో ఏమైనా చేసేందుకు సిద్దంగానే ఉన్నట్లు భావించొచ్చు.