దసరా పండుగ వస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం దుర్గా పూజలను కోవిడ్ మధ్య జరుపుకుంటున్నామని, భక్తులందరూ ఆదర్శప్రాయమైన నిగ్రహాన్ని చూపించాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశాన్ని సక్రమమైన మార్గంలో నడిపించిన ఎందరో మహానుభావులు బెంగాల్ రాష్ట్రం నుంచే వచ్చారన్నారు. బెంగాల్ నుంచి వచ్చిన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ నవరాత్రులు ప్రతిబింబమని అన్నారు. కరోనా వచ్చిన నేపథ్యంలో ప్రజలంతా పండుగలు జాగ్రత్తగా జరుపుకోవాలని ఇది వరకే అందరూ సూచిస్తున్నారు. ఎక్కువగా ప్రజలు గుమిగూడకుండా కరోనా నిబంధనలు పాటించాలని పిలుపునిస్తున్నారు. వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉంటే ఉండవచ్చు కానీ…. భక్తిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మధ్య దుర్గ పూజలను జరుపుకుంటున్నా… వ్యక్తుల ఆనందంలో, ఉత్సాహంలో ఎలాంటి మార్పూ లేదని, ఇదీ నిజమైన బెంగాల్ అని మోదీ ప్రశంసించారు.
కరోనా నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్ ధరించి పండుగను జరుపుకోవాలని సూచించారు. దేశానికి అవసరం అయినప్పుడల్లా బెంగాల్ ఆదుకుందన్నారు. ఈ గడ్డ నుంచి చాలా మంది మహానుభావులే ఉద్భవించారని కొనియాడారు. వారి పేర్లను చెబుతూ పోతే రోజంతా గడుస్తుందన్నారు. బెంగాల్ లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి మోదీ వివరించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు గ్యాస్ కనెక్షన్ల గురించి పేర్కొన్నారు. విజయదశమి సందర్బంగా 5 రోజుల పాటు నిర్వహించే సాల్ట్లేక్ ఉత్సవాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.