ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీనిపై లోకేష్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిరుగుతూ రైతులను పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను పరామర్శించేందుకు మంత్రులు రాలేదని విమర్శించారు. ఇక లోకేష్ పర్యటనలపై వైసీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. వర్షాలకు, వరదలకు లోకేష్కు తేడా తెలియదని మంత్రులు అన్నారు. ఇక ఇప్పుడు మరోసారి తనపై వ్యాఖ్యలు చేసిన వైసీపీపై లోకేష్ స్పందించారు. అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తనపై విమర్శలు చేసిన మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. తనకు హోదా లేదని.. ఆవేదన ఉందన్నారు. తనను ఎద్దు అని ఒక మంత్రి అన్నారని.. మరి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్ను ఏమనాలని ప్రశ్నించారు.
వారం మునిగితేనే సహాయం అంటారా.. మానవత్వం లేదా అని మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో వరి పంట మూడు సార్లు మునిగిందని, రాయలసీమలో 10 లక్షల ఎకరాల వేరుశెనగ దెబ్బతిన్నదన్నారు. తిత్లీ వస్తే తమ ప్రభుత్వ హాయాంలో 28 రోజుల్లో సిక్కోలుకు 160 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల రూపాయల సహాయం మాత్రమే చేశారన్నారు. రైతుకు రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం ఎలా అవుతుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇక ఇన్నాళ్లూ హైదరాబాద్లో ఉన్న లోకేష్ బాబు ఇప్పుడు ఉన్నట్టుండి ప్రజా సమస్యల గురించి మాట్లాడటంపై రాజకీయ విశ్లేషులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో టిడిపి చాకచక్యంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. రాజకీయ కారణాలతోనే ప్రజల్లోకి వెళుతున్నట్లు కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.