టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నట వారసుడు బాలకృష్ణ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి జీవిత కథని పాఠ్యాంశంలో చేర్చినందుకు గాను ఫేస్ బుక్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ అగ్రహీరో నందమూరి తారక రామారావు జీవితాన్ని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పాఠ్యాంశంలో చేర్చింది.
ఈ పుస్తకానికి సంబంధించిన పేజీలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ… ‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు బాలయ్య.