కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అనుకూలంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటేనే అన్నివిధాలా బాగుంటుంది. లేదంటే లేనిపోని సమస్యలతో రాష్ట్రం నష్టపోతూ ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారంగా జగన్ సర్కార్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఏపీ సీఎం వై.ఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే మెలుగుతూ ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఏం చెబితే జగన్ అదే చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది పలువురికి.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి బీజేపీ పని చేసింది. ఈ సారి మాత్రం ఒంటరిగానే ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీకి బాగా అనుకూలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఇటీవలె జగన్ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని రద్దు చేసింది. అయితే ఈ విషయంలో వింతేమీ లేకపోయినా ఈ జూదాన్ని నివారించాలని గత కొద్ది రోజులుగా బీజేపీ కోరుతూనే ఉంది. దీంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీ ఖుషీగా ఉంది.
ఇటీవల బీజేపీ ఏపీ అద్యక్షుడు సోము వీర్రాజు ఎంపీడీవోల విషయంలో డీడీవోలుగా పదోన్నతలు ఇవ్వాలని ప్రస్తావించారు. ఈ విషయంలో సైతం జగన్ సానుకూలంగానే స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రభుత్వంపై హ్యాపీగానే ఉన్నారంట. దీన్ని బట్టి చూస్తే బీజేపీ ఏం కోరినా వై.ఎస్ జగన్ సర్కార్ చేసేస్తుందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఇక ఇదే తరుణంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం కూడా జగన్ అడిగితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కేంద్రం, రాష్ట్రం మధ్య ఉన్న సత్సంబంధాలతో రాష్ట్రానికి మంచి జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి.