సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాంను కట్టి చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన విజయసాయి చంద్రబాబుపై మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాంను కట్టి పోలవరం పూర్తి చేసినట్లు బిల్డప్ ఇచ్చారని మండిపడ్డారు. పోలవరం డ్యాం పునాదులు కూడా చంద్రబాబు వేయలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అధికారంలో ఉండి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయిందన్నారు.
చంద్రబాబు ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించారన్నారు. మరో ట్వీట్ చేసిన విజయసాయి 151 సీట్లు ఓడి, తన కొడుకును ఓడగొట్టుకున్న చంద్రబాబు రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేశానని ఇప్పుడు గ్రాఫిక్స్ చూపిస్తున్నారన్నారు. షేమ్.. షేమ్.. బాబూ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
కాగా సీఎం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ వచ్చి ముందుకు సాగకుండా చేసిందన్నారు. టిడిపి పాలనలో 13 జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ విషయాలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.