ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సతీసమేతంగా పాల్గొనాలని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇతర మతస్థులకు డబ్బులిచ్చి.. హిందూవుల పండుగలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
తిరుపతి, శ్రీశైలం, తదితర పుణ్యక్షేత్రాలలో ఉచిత దర్శనాలను తగ్గించారన్నారు. రాష్ట్రంలో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. భగవంతుడిని సామాన్యుడికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. జగన్ హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతర మతాలను మాత్రం ప్రోత్సహిస్తున్నారన్నారు. చర్చి అద్దం పగులగొట్టిన కేసులో 40 మందిని అరెస్టు చేసిన ప్రభుత్వం.. అంతర్వేది రథం దగ్దం విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు.
హిందూ దేవాలయాల్లో దోపిడీ జరుగుతోందన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జగన్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించాలన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించడంతో పాటు అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా రఘురామకృష్ణరాజు వైసీపీ వై.ఎస్ జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలోని లోపాలను ఆయన ఎత్తిచూపుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని ఆయన చెప్పారు.