అన్లాక్ సడలింపులు వస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో సినిమాహాళ్లు, మాల్స్, పాఠశాలలు తెరుచుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే చాలా కోల్పోయామని ఇక నుంచి జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్లాక్కు సంబంధించి అనధికారికంగా పలు పుకార్లు వస్తున్నాయి. ఇందులో సెప్టెంబరు నెలలో పాఠశాలలు, మాల్స్, థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతులు వస్తాయని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తారని టాక్.
ఇప్పటికే విద్యాపరంగా ఎంతో నష్టపోయినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం వృథాగా పోయినా పర్లేదు కానీ కరోనా బారిన మాత్రం పడకుండా ఉంటే చాలని అనుకుంటున్నారు. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయితే ఎంత మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ పాటించినా కచ్చితంగా కరోనా ఎవరికైనా ఉంటే తమ పిల్లలకు కూడా సోకుతోందన్న భయం వారిలో ఉంది.
అయితే ఇక సినిమాహాళ్లు, మాల్స్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. లాక్ డౌన్ ఉన్నప్పుడు కూడా స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలను జనాలు బాగా ఆదరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తినడానికి మాత్రం ఏమాత్రం కరోనా సాకు చూపలేదు. అలాంటిది ఇప్పటికే మాల్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారాన్న ఆలోచనలోనే ఉన్నారు.
ఇక చివరగా మిగిలింది థియేటర్లు. ఇవి ఓపెన్ చెయ్యాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ మునుపటిలా అస్సలు కలెక్షన్లు రావని తెలుస్తోంది. కచ్చితంగా సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో థియేటర్ల యజమానులు ఎలా ముందుకు వెళతారో తెలియదు. ఒకవేళ రెండు సీట్లు కొని ఒక సీట్లో కూర్చోవాలన్న రూల్ తీసుకొస్తే జనాలు ఆసక్తి చూపరన్న వాదన ఉంది. ఇండస్ట్రీ మాత్రం ఇప్పటికే ఓటీటీ మాట చెబుతోంది. థియేటర్ల సంగతి అటుంచితే ఇప్పటికి ఓటీటీని సద్వినియోగం చేసుకొని లాభం పొందాలని యోచిస్తున్నారు నిర్మాతలు. మరి థియేటర్లు ఓపెన్ చేయాలన్న యోచనలో కేంద్రం ఉందో లేదో మాత్రం అధికారికంగా తెలియదు.