కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రైతులకు తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఓ లేఖ రాశారు. ఈ లేఖను అందరూ చదవాలని రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
ఇంతకీ రైతులకు రాసిన లేఖలో ఏముందంటే.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కొంత మంది చెప్పే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఆ లేఖలో రైతులకు విజ్ణప్తి చేశారు. అంతే కాకుండా ఎంఎస్పీపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన రాసుకొచ్చారు. ‘‘కొన్ని రైతులు సంఘాలు తప్పుడు ప్రచారం, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వారిని బయటికి పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను ఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుకు చేరుకోలేకపోతున్నారు’’ అని రైతులకు రాసిన లేఖలో తోమర్ పేర్కొన్నారు.
దీనిపై మోదీ స్పందిస్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తోమర్ వెల్లడించారని, ఎంఎస్పీపై రైతులకు స్పష్టమైన హామీని ఇచ్చారని మోదీ అన్నారు. అన్నదాతలకు నేను విజ్ణప్తి చేస్తున్నాను. దయచేసి తోమర్ రాసిన లేఖను చదవండి. అదే విధంగా దేశ ప్రజలను కూడా నేను కోరుతున్నాను. దీనిని వీలైనంత ఎక్కువ మంది చదివేలా సహకరించండి’’ అని మోదీ అన్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.