వారు స్కెచ్ గీస్తే.. మోడీ అయినా గెలవాల్సిందే.. ప్లాన్ చేశారంటే.. నితీశ్ సీఎం పీఠంపై కూచుంటారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలు గుర్తించడంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ రూటే సపరేటు. మరి వారితో ఒప్పందం కుదుర్చుకున్న వైసీపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తీరం చేరుతుందా?
ప్రశాంత్ కిశోర్.. తెర వెనుక సూత్రధారి.. ఏ పార్టీ ఏ ఎన్నికల్లో గెలవాలన్నా కరెక్ట్గా వ్యూహం రచించడంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ సూపర్ ఫేమస్.
దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి బంపర్ మెజరిటీ రావడం వెనుక ప్రశాంత్ కిశోర్ ప్లానింగే కారణమంటారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ టీమ్తో వైసీపీ ఒప్పందం చేసుకుంది. ఏపీ పాలిట్రిక్స్లో తన ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రశాంత్ కిశోర్ టీమ్ రెడీ అయింది. వైసీపీ అధినాయకత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్ నుంచి పని మొదలెట్టాలి. అయితే.. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ఈ నెల రెండో వారంలోనే ప్రశాంత్ టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.
ఇప్పటికే గోదావరిజిల్లాల్లో, ఉత్తరాంధ్రాలోని రెండు జిల్లాలు, రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్ పర్యటించినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయడం, బూత్లు, మండలాలు, జిల్లాల వారీగా కులాల బలాలను బేరీజు వేయడం వంటివి ప్రశాంత్ టీమ్ చేస్తోంది. కాపు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలు, మైనార్టీ వర్గాల్లో స్పందన, ఎన్నికలపై ప్రభావం ప్రశాంత్ కిశోర్ బృందం అంచనా వేసి.. ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలను వైసీపీ అధినాయకత్వానికి అందిస్తుంది.