లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.. తమిళనాడులో రజనీకి ఏం పని అన్న వాళ్లందరనీ తాను పక్కా లోకల్ అంటూ దిమ్మతిరిగే ఆన్సరిచ్చి.. పొలిటికల్ ఎంట్రీపై మరింత సస్పెన్స్ రంగరించారు. యుద్ధం చేయాల్సి వస్తే.. అందరి సాయం కోరతానన్నారు.
తమిళ పాలిటిక్స్ లోకి తలైవా ఎంట్రీ ఖాయమేనా?వారం రోజుల పాటూ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన రజనీ తన మనసులోని మాటను బయటపెట్టారు.. రజనీ స్థానికుడు కాదని, తమిళ రాజకీయాల్లో ఆయనకేం పని అన్న వారందరికీ తాను పక్కా లోకల్ అని తేల్చి చెప్పారు..కొందరు తనను బయటి రాష్ట్రం వ్యక్తిగా కామెంట్ చేస్తున్నారని.. కానీ తాను 40 ఏళ్లుగా తమిళనాడులో ఉంటున్నానని రజనీకాంత్ స్పష్టం చేశారు.
యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతానని అప్పుడందరూ తనకు మద్దతుగా యుద్ధంలో పాల్గొనాలని రజనీ పిలుపునిచ్చారు.. తమిళనాడులో మంచి నేతలున్నారని కానీ వ్యవస్థ కలుషితమైపోయిందని అన్నారు.తమిళనాట జయలలిత మరణం తర్వాత బలమైన నేతలేకుండా పోయారు.. కరుణానిధి కూడా మంచానికే పరిమితమైనందున యువతకు దిశానిర్దేశం చేయగలిగిన సత్తా ఉన్న నేత అవసరమని తమిళ ప్రజలు భావిస్తున్నారు.
రజనీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. మరో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని.. బిజెపిలో చేరి సేవచేయవచ్చుననీ కొందరు సీనియర్ నేతలు సలహా ఇచ్చారు. లేదా రజనీ బిజెపి సహకారంతో కొత్త పార్టీ పెట్టినా మంచిదేనంటూ మరికొందరు అభిమానులు కోరుతున్నారు.. దేవుడు ఆదేశిస్తే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వస్తానంటున్న రజనీ వారం రోజుల నుంచి చెన్నైలోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్ లో అభిమానులతో సమావేశాలు నిర్వహించారు.