రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టాక తీవ్ర గందరగోళం నెలకొంది. అయినప్పటికీ బిల్లులయితే పాసయ్యాయి కానీ 8 మంది ఎంపీలపై వేటు పడింది. కాంగ్రెస్తో పాటు ఆప్, సీపీఎం, టీఎంసీల పార్టీల ఎంపీలను సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు.
వ్యవసాయ రంగంలో కొత్త సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ బిల్లులు ఆమోదించుకోవడం బీజేపీని గందరగోళానికి గురి చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే మెజార్టీ ఉన్న లోక్సభ విషయం పక్కన పెడితే రాజ్యసభలో ఆ పార్టీకి అంత బలం లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 అయితే బీజేపికి సొంతంగా 86 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి 40 మంది సబ్యులు ఉన్నారు. మిగతా సభ్యులంతా ఇతర ప్రాంతీయ పార్టీల వారు ఉన్నారు. అయితే వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్బంగా ఎన్.డి.ఏ భాగస్వామ్యమైన అకాలీదళ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎంతగా అంటే ఆ పార్టీ నుంచి మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి రాజీనామా చేసేంతలా వ్యతిరేకించింది.
అయితే ఇదే ప్రతిపక్షాలకు గట్టి బలం తెచ్చిపెట్టింది. భాగస్వామ్య పార్టీలే మద్దతు ఇవ్వలేని ఈ బిల్లు పాస్ అవ్వకూడదని నిర్ణయించుకున్న పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి బిల్లుపై పోరాడాయి. బిల్లును రాజ్యసభలో ఓటింగ్కు తీసుకొచ్చిన సమయంలో ఆందోళలను చేశాయి. దీంతో సభలో ఘర్షణ వాతావరణం కల్పించేందుకు కారణమైన వారికి చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే బిల్లులు రాజ్యసభకు వచ్చిన సమయంలో చైర్మన్ వెంకయ్యనాయుడు లేకుండా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ఉన్నారు. దీంతో వెంకయ్యనాయుడు ఉండి ఉంటే రగడ జరిగేది కాదని ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వెంకయ్యనాయుడు చైర్మన్గా బాద్యతలు తీసుకున్నప్పటి నుంచి సభను నడిపించే తీరు చాలా డిఫరెంట్. విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా చారిత్రాత్మకమైన ఎన్నో బిల్లులను ఆమోదింపజేసేలా చేశారు. దీనిలో కచ్చితంగా వెంకయ్య ప్రావీణ్యం ఉందని అందరికీ తెలిసిందే. అయితే ఆయన లేకపోవడం వల్ల సభలో గందరగోళం ఏర్పడటమే కాకుండా విపక్ష సభ్యుల సస్పెన్షన్ వరకు దారి తీసిందన్న అబిప్రాయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.