ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటి తర్వాత అందరి చూపు జగన్వైపే ఉందని తెలుస్తోంది. ప్రధాని గంట సేపు ఓ సీఎంతో భేటి అవ్వడం మామూలు విషయం కాదని అంటున్నారు. దీంతో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
గతమెలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి దేశ అభివృద్ధికి కీలక అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎంతో భేటికి అంత సమయం కేటాయించడం ఆషామాషీ కాదు. అయితే జగన్తో ఇంత సేపు మాట్లాడటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీ అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ దేశాన్ని ఆకర్షించాయి. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో రాజీ లేకుండా సీఎం ముందుకు వెళుతున్నారు. ఎలాంటి రాజకీయ కారణాలు సాకులుగా చూపకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.
ఇక ప్రధానితో భేటిలో రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మూడు రాజధానులు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందన్న దానిపై వివరించారు. గతంలో ఒకే ప్రాంతం అభివృద్ధి చెందిన తీరు.. ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు వివరించారు. దీంతో పాటు అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి కూడా మాట్లాడారని తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ చేయించాలని ఆయన పీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే వీటన్నింటిపై మోదీ నుంచి సానుకూల స్పందన వచ్చిందనుకోవచ్చు. త్వరలోనే అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక హిందూఆలయాల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని మోదీకి వివరించారు.
దీంతో పాటు పార్లమెంటులో ప్రస్తావించిన హైకోర్టు తీర్పుల విషయాన్ని మరోసారి ప్రధాని భేటిలో గుర్తుచేసినట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజార్టీతో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రతి దానికీ అడ్డం పడుతున్న తీరును వై.ఎస్ జగన్ స్పష్టంగా మోదీతో మాట్లాడినట్లు సమాచారం. అభివృద్ధి విషయంలో రాష్ట్రం ముందుకు పోవాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఇందుకోసం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పోలవరం పూర్తి చేయడంతో పాటు, ఇతర పరిశ్రమలు నెలకొల్పేందుకు సహాయం అందించాలని కోరారు. యాబై నిమిషాల మోదీ, జగన్ భేటీలో మాట్లాడిన ప్రతి విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందనే వచ్చిందని టాక్. వీటన్నింటికి కారణం పరిపాలనలో ఏపీ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలు ప్రధాని దృష్టిని ఆకర్షించడమే అని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీలో చేపట్టిన విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని ఇటీవలె చెప్పారు. దీన్ని బట్టి జగన్ కేంద్రం దృష్టిని బాగా ఆకర్షించారని తెలుస్తోంది. పైగా ప్రధాని భేటి ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి ఫలప్రదంగా జగన్ ప్రధాని భేటి జరిగిందని ట్వీట్ చేయడం కూడా ఏపీకి శుభపరిణామమే అంటున్నారు.