రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనాలే జరుగుతుంటాయి. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కానిస్టేబుల్, డీజీపీ తలపడగా ఇక్కడ కానిస్టేబుల్కే టికెట్ దక్కింది. ఇది జరిగింది ఎక్కడో కాదు బీహార్లో. టికెట్ ఇచ్చింది బీజేపీనే.
బీహార్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, జేడీయూ కూటమి ఎన్నికల బరిలో ముందంజలో ఉంది. ఇప్పటికే నితిష్ అభ్యర్థుల పేర్లు ప్రకటించేశారు. కాగా బీజేపీ కూడా ఇదే పనిలోనే ఉంది. కాగా ఈ ఎన్నికల్లో మాజీ కానిస్టేబుల్ పరశురాం చతుర్వేది బీజేపీ తరుపున టికెట్ ఆశించారు. మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే జేడీయూ నుంచి సీటు ఆశించారు. ఇటీవలె ఈయన జేడీయూలో చేరారు. కాగా ఇద్దరూ బక్సర్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుకున్నారు.
అయితే బీజేపీ, జేడీయూ కూటమిలో భాగంగా బక్సర్ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇంకే ముంది మాజీ కానిస్టేబుల్ పరశురాం చతుర్వేదికే బక్సర్ అసెంబ్లీ సీటు దక్కింది. కాగా మాజీ డీజీపీకి నిరాశే ఎదురైంది. ఈ విచిత్ర సంఘటన గురించి ఇప్పుడు బక్సర్తో పాటు బీహార్ మొత్తం టాక్ నడుస్తోంది. ఈ విషయంపై బీజేపీ అభ్యర్థి పరశురాం మాట్లాడుతూ మాజీ డీజీపీ నాకు అన్నలాంటి వారన్నారు. ఆయన పట్ల తనకెప్పుడూ ఆప్యాయత ఉంటుందన్నారు. మరి ఈ మాజీ డీజీపీకి మరో చోట సీటు కేటాయిస్తారేమో అన్న చర్చ నడుస్తోంది.