ఎప్పుడూ వివాదాస్పదంగానే మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ భూముల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనమైందన్నారు. ప్రభుత్వం అమరావతి కుంభకోణంపై విచారణ చేస్తుండగా.. దీన్ని అడ్డుకుంటున్నారన్నారు.
చంద్రబాబు నాయుడుకు విచారణను ఎదుర్కొనే దమ్ము లేకపోతే జగన్ కాళ్లు పట్టుకోవచ్చు కదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కాళ్లు పట్టుకొని విచారణ జరగకుండా చేశారన్నారు. అమరావతిలో ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆయన అనుచరులు తాపత్రయపడుతున్నారన్నారు. అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే చెప్పినట్లు గుర్తు చేశారు.
కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కొడాలి నాని అన్నారు. భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయాలని సీఎం జగన్కు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఏ నాయకుడు తీసుకోని నిర్ణయాలు జగన్ తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్ధేశంతోనే జగన్ నిజాయితీగా ఉన్నారని చెప్పారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు రాకుండా టీడీపీ సిగ్గు లేకుండా అడ్డుపడుతోందన్నారు. ఇటీవల మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో టిడిపి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.