మెగాస్టార్ చిరంజీవి దీపావళి పండుగ రోజు తనకు ఇష్టమైన గురువును కలుసుకున్నారు. ఆయనే దర్శకుడు కె.విశ్వనాథ్. తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవలె చిరంజీవి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే మూడు రోజుల తర్వాత ఆయన మరల పరీక్షలు చేయించుకోగా కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. దీంతో మొదట చిరు చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఫలితం తప్పుగా వచ్చిందని అనుకున్నారు. అనంతరం దీపావళి పండుగ రావడంతో తన గురువు విశ్వనాథ్ను ఆయన కలిశారు. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. తనకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారన్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు చిరంజీవి సినీ కెరీర్లో మరచిపోలేనివిగా మిగిలిపోయాయి.