ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి రాత్రి వేళ ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా ఉన్న దుకాణాల ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా వారు నిద్రపోకుండానే ఉన్నారు.
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్ లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో రాజుకున్న మంటలు వ్యాపించాయి. దీంతో హుటాహుటిన 20 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పారు. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ మాల్ లో మొబైల్ ఫోన్ల యాక్ససరీలు విక్రయిస్తుంటారు. అయితే ప్రమాదం ఎలా సంభవించిందన్నది మాత్రం తెలియలేదు.
కాగా అగ్నిప్రమాదం జరిగినపుడు సిటీసెంటరుమాల్ లో 300 మంది దాకా ఉన్నారని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పుతుండగా ఓ ఫైర్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫైర్ మెన్ ను ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సిటీసెంటరు మాల్ చుట్టుపక్కల ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. సిటీసెంటరు మాల్ లో ఉన్న 300మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపులోకి రాలేదు. అయితే గురువారం రోజు ముంబైలో రెండు ప్రమాదాలు జరిగాయి. కుర్లా వెస్ట్ ప్రాంతంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో కూడా అగ్నిప్రమాదం సంభవించింది.