ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి మమతా మోహన్దాస్. కేవలం నటిగానే కాకుండా తన గాత్రంతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ బ్యూటీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరంగా ఉంటూ వస్తోన్న ఈ చిన్నది తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది.
ఇదిలా ఉంటే నటిగా, సింగర్గానే కాకుండా ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు మమతా మోహన్ దాస్. మలయాళంలో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిందీ అమ్మడు. ఈ విషయాన్ని మమతా స్వయంగా తెలిపింది. మమత మోహన్ దాస్ ప్రొడక్షన్ పేరుతో ఇక మీదట సినిమాలు నిర్మిస్తానని పేర్కొంది. ఈ విషయమై మమతా మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ఇచ్చింది.. మరి నేను ఆ పరిశ్రమకు ఎంతో కొంత చేయాలి కదా..అందుకే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితురాలు నోయిల్ బెన్తో కలిసి కొత్త ప్రయాణం మొదలు పెట్టాను. మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ ప్రాధాన్యమున్న చిత్రాలు నిర్మిస్తాను’ అని చెప్పుకొచ్చిందీ చిన్నది.