2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పింది మోడల్ మానుషీ చిల్లర్. హర్యానాకు చెందిన ఈ చిన్నది తన అందంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా బాలీవుడ్లో సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా అక్షయ్ కుమార్తో కలిసి ‘పృథ్విరాజ్’ అనే చిత్రంలో నటిస్తోంది. నిజానికి ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలను, మోడలింగ్లోకి రావడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా మానుషీ మాట్లాడుతూ..‘నేను యాక్టర్ కంటే ముందు డాక్టర్ని కావాలనుకున్నాను. మోడలింగ్ పోటీల్లో పాల్గొనడానికి ముందు నేను ఒక్కసారి కూడా ముంబయికి రాలేదు. గత ఐదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల ముందు ముంబయిలో నాకు ఎవరూ తెలియదు. కానీ ఇప్పుడు మంబయి నా హోమ్ టౌన్గా మారిపోయింది. నేను డాక్టర్ కావాలనుకున్నాను కాబట్టి యాక్టింగ్పై నాకు ఏ మాత్రం అవగాహన లేదు, సంబంధం లేని రంగంలోకి వచ్చి ఇప్పుడు నటనతో మీ ముందుకొస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ మాజీ విశ్వసుందరీ.