ఏపీ విభజనతో ఇప్పటికే చచ్చి పడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. కొద్ది రోజులుగా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీ మారటం ఖరారైంది. తాజాగా ఆయన జగన్ పార్టీలోకి మారేందుకు ఆయన డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జగన్ తో ఫోన్లో టచ్ లో ఉన్న మల్లాది విష్ణు.. మంగళవారం భారీ ఎత్తున హైదరాబాద్ కు తరలివెళ్లారు.
లోటస్ పాండ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తాను పార్టీ మారనున్న విషయాన్ని వెల్లడించారు. పది రోజుల వ్యవధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వెల్లడించారు. పార్టీలోకి వస్తున్న విష్ణుకు విజయవాడ పార్టీ పగ్గాలు అప్పచెబుతారని చెబుతున్నారు. నిజానికి మల్లాది విష్ణు ఎప్పుడో పార్టీలో చేరాల్సింది. కానీ.. అందుకు తగిన పరిస్థితులు చోటు చేసుకోకపోవటంతో ఆయన పార్టీలో చేరే అంశం ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడైన మల్లాది విష్ణు.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ తో కలిసి ఉంటారన్న అభిప్రాయం ఉండేది. అయితే.. ఇన్నాళ్లకు ఆ అభిప్రాయం నిజమైంది. పార్టీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసే సమయంలో.. తన తండ్రితో మల్లాది విష్ణుకి ఉన్న అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు.