శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడికి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి యూనిట్ సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో రోషన్ సరసన నటించే నటీమణి ఎవరనే చర్చ సినిమా ప్రకటించిన నాటి నుంచి జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా అలనాటి అందాల తార శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ నటించనుందని వార్తలు వచ్చాయి. బోణీని రాఘవేంద్రరావు ఒప్పించి తెలుగు సినిమాతోనే ఖుషీని హీరోయిన్గా పరిచయంచేయనున్నాడని రూమర్లు వచ్చాయి. అయితే దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక అనంతరం ఈ సినిమాకు కచ్చితంగా ఒక కొత్తమ్మాయినే హీరోయిన్గా తీసుకోనున్నారనే చర్చ నడిచింది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా మాళవిక నాయర్ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మాళవిక తాజాగా ఓరేయ్ బుజ్జి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక గతంలో ఎవడే సుబ్రమణ్యం, విజేత చిత్రల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుందీ చిన్నది. తాజాగా పెళ్లి సందడిలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాళవిక, రోషన్ల మీద ఫొటో షూట్ కూడా చిత్రీకరించారని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికార ప్రకటన రానుంది. ఇక ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా గౌరీ రొనన్కి దర్శకత్వం వహించనున్నాడు.