‘ఆర్ ఎక్స్ 100’తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘మహా సముద్రం’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అజయ్ ఈ విషయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారనే దానిపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో.. సమంత, సాయిపల్లవి, అదితీరావు హైదరీ వంటి వారి పేర్లు వినిపించాయి.
ఇప్పుడీ అవకాశం ‘గ్యాంగ్లీడర్’ భామ ప్రియాంక అరుళ్ మోహన్ అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా చేస్తున్న ‘శ్రీకారం’ చిత్రంలోనూ ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ జోడీనే మరోసారి ఈ కొత్త చిత్రంతో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక ఇప్పటికే ఈ కథకు అంగీకారం తెలిపిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.