మోడల్గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారింది మధుశాలిని. ఇక ‘కితకితలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైందీ బ్యూటీ. ‘గూఢచారి’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ట్రెడిషినల్ పాత్రల్లో కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రలతోనూ ఆకట్టుకునే మధుశాలిని.. ఇటీవల వెబ్ సిరీస్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ఎక్స్ పైరీ డేట్’ వెబ్ సిరీస్ తాజాగా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ముచ్చటించిన మధు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
వెబ్ సిరీస్ల గురించి చెబుతూ.. ‘సినిమాలకు సిరీస్లకు చాలా తేడా ఉంది. సినిమాలు కంఫర్ట్ జోన్లో చేస్తాం. సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ నేపథ్యంలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ వెబ్ సిరీస్లో అన్ని పాత్రలకూ ప్రాధాన్యముంటుంది. రెండు గంటల్లోనే మొత్తం చూపించాలనే తొందర ఉండదు. వెబ్ సిరీస్లపై తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువగా ఆసక్తి చూపుతున్నారు.. అయితే పరిస్థితి క్రమంగా మారుతోంది. నా మొదటి సినిమా ‘కితకితలు’ సమయానికి, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మార్పులను మనం ఆహ్వానించాలి. కథనచ్చితే బోల్డ్ క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమే.. ఆ పాత్ర ఆసక్తికరంగా ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.