తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఆలయంలో రథం దగ్దం అవ్వడం చర్చనీయాంశమైంది. రథం దగ్దం కావడంతో రాజకీయ నాయకులు మాటల దాడులకు దిగుతున్నారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కామెంట్ చేశారు.
వైసీపీ హయాంలో రథం కాలిపోవడం రాష్ట్రంలో అరిష్టమంటున్నారన్నారు. ఘటనకు ఎవరు బాధ్యులో గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాలను అపవిత్రం చేస్తూ రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నారన్నారు. కాగా అర్దరాత్రి ఒంటిగంట సమయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ రథం దగ్దమైంది. రథానికి మంటలు అంటుకోవడం ప్రమాద వశాత్తు జరిగిందా లేక ఆకతాయిల పనా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ రథాన్ని 60 సంవత్సరాల క్రితం తయారుచేశారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించి విచారణకు ఆదేశించారు. రథం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.