ఏపీలో తిరుమలతో పాటు హిందూ దేవాలయాలను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం కానీ, ఆంజనేయ విగ్రహంపై దాడి కానీ దేవుళ్లకు తగిలిన గాయం కాదని హిందూవులకు తగిలిన గాయమని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. కాగా మతోన్మాదంతో మీరు చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవిస్తారని మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. చెయ్యి విరిగితే ఏమవుతుంది, కాలు విరిగితే ఏమవుతుందని మాట్లాడిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ భవిష్యత్తులో చెయ్యి, కాలు విరగ్గొడతారని కబడ్దార్, బీ కేఆర్ ఫుల్ అని ఆగ్రహంగా మాట్లాడారు.
వేరే మతాన్ని వెనకేసుకొని రావడానికి హిందూవుల మనోభావాలు ఇంత దారుణంగా దెబ్బతియ్యాల్సిన అవసరం లేదన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఆపాలన్నారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. నాని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న ఆయన.. తిరుమలలో ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ఇందులో రెండో చర్చ లేదని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి చేయి విరిగిపోతే నష్టమేంటని మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని, దేవుడిపై కూడా ఇలాంటి భాష మాట్లాడడం బాధాకరమని అన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ సంతకం పెట్టారని సోము వీర్రాజు తెలిపారు.