కాపు రిజర్వేషన్ల అంశం లేవెనెత్తుకొనే వారు కరువయ్యారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇన్నాళ్లూ ముద్రగడ పద్మనాభం ముందుండి నడిపించినా ఆయన ఇప్పుడు సారథ్య బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జేఏసీ నేతలు మాత్రం ఆయన వైపే చూస్తున్నారు. కాగా జగన్ ఇప్పటికే ఈ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
కాపు రిజర్వేషన్ల అంశం తమ చేతుల్లో ఏమీ లేదని వై.ఎస్ జగన్ ఎప్పుడో చెప్పేశారు. ఇది కేంద్రం పరిధిలో ఉంటుందని అన్నారు. కాగా 2014 ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని భుజానెత్తుకున్నచంద్రబాబు ఆపై ఏమీ చేయలేకపోవడంతో ఉవ్వెత్తున ఉద్యమం లేచిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అప్పట్లోనే వై.ఎస్ జగన్ దీనిపై మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదంటూనే.. ప్రతి సంవత్సరం కాపుల సంక్షేమం కోసం 2వేల కోట్ల చొప్పున పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
అయితే ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల ఉద్యమం సైలెంట్ అయ్యింది. పలు కారణాల వల్ల ఉద్యమం నుంచి తప్పుకున్న ముద్రగడ.. ఎవరైనా ఉద్యమాన్ని నడిపిస్తే తన మద్దతు ఉంటుందని చెప్పారు. అయితే కాపు ఉద్యమాన్ని నడిపించే నాయకుడి కోసమే ఇప్పుడు అన్వేషణ మొదలైంది. కాగా ద్వారకా తిరమలలో ఏపీలోని అన్ని జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమంపై చర్చించారు. ముద్రగడకు మళ్లీ ఉద్యమం బాద్యతలు అప్పగించి ఆయన సారథ్యంలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఒప్పుకుంటారా అంటే డౌటే అనిపిస్తోంది. పైగా ఏపీలో ఇప్పుడు కాపు ఉద్యమం గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జగన్ ఈ విషయంలో వివరణ ఇచ్చారు. అయినా మళ్లీ ఉద్యమం లేవనెత్తడం సరైనదేనా అని పలువురు మేధావులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాపు ఉద్యమం వస్తుందా.. వస్తే చేయాల్సిందా కేంద్రమే చేయాలన్నప్పుడు జగన్ ఏం చేస్తారన్నది వేచి చూడాలి.