శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై విద్యుత్ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్యానల్ బోర్డులో మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
శ్రీశైలంలో కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. కుడి గట్టు ఆంధ్రప్రదేశ్కి, ఎడమగట్టు తెలంగాణాకు చెందినది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ టర్మినల్లో ఈ మంటలు వచ్చాయి. ప్రమాదం జరిగినపుడు లోపల 17 మంది ఉన్నారు. అయితే వీరంతా తమ వంతుగా ప్రమాదం జరిగిన వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో 12 గంటలకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఆ తర్వాత 8 మంది లోపలి నుంచి బయటకు వచ్చేశారు. మిగిలిన 9 మంది దట్టమైన పొగల వల్ల రాలేక లోపలే ఉండిపోయారు. 9 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఉదయం నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడంలోనే నిమగ్నమయ్యారు. దట్టమైన పొగలు వీరికి ఆటంకంగా మారాయి. మొత్తానికి రెస్క్యూ టీం మృతదేహాలను బయటకు తీసింది.
విషయం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అధికారులు హుటాహుటిని సంఘటన స్థలానికి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘటనపై సీఐడి విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరగడంతో తెలంగాణ మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది.