అమరావతి భూ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ కేసు విచారణలో కదలిక వచ్చే పరిణామాలు రాబోతున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు నుంచీ అమరావతి భూముల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తోంది. అందుకే సీఎం జగన్ సిట్ను ఏర్పాటు చేసి విచారణ పక్కా జరగాలని నిర్ణయించారు. అయితే ఊహించని విధంగా ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ ఈ విషయంపై మరింత చాకచక్యంగా విచారణ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సీబీఐతో విచారణ చేపించాలని కేంద్రాన్ని కోరింది.
దీనిపై కేంద్రానికి మరోసారి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన ఏపీ కెబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించే అవకావం ఉంది. అంతకంటే ప్రధానంగా అమరావతి భూముల కుంభకోణం విషయాన్ని సీబీఐకి అప్పగించాలని కేబినెట్ తీర్మానించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హైకోర్టు దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం మరే విధంగా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.