తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన తాజాగా చేసిన ఓ ప్రకటన అందరినీ మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది.
తమిళనాడు రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కమల్హాసన్ రాజకీయ పార్టీ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని అంటున్నారు కానీ.. స్పష్టత ఇవ్వడం లేదు. వచ్చే ఏడాదిలోనే తమిళనాడు ఎన్నికలు.. సమయం దగ్గర పడుంది. దీంతో అందరిలోనూ అసలు రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా? లేదా? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ మరోసారి రాజకీయ ఉత్కంఠతకు తెర తీశారు. తన అభిమాన సంఘానికి చెందిన అధ్యక్షులను నవంబర్ 30న చెన్నైకు రావాలంటూ పిలుపునిచ్చారు.
వారితో ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ ఉంటుందట. సూపర్స్టార్ అసలు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. సోమవారం జరగబోయే మీటింగ్లో తన రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్స్టార్ క్లారిటీ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై పర్యటనకు వెళ్లిన సమయంలోనే రజినీ కాంత్ను కలుస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయినా అది జరగలేదు. లీలాప్యాలెస్ హోటల్ ఉన్న అమిత్షాను రజనీకాంత్ సన్నిహితుడు గురుమూర్తి కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య చర్చ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రజినీ తాజా ప్రకటనపై ఏం జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.