దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి అలాగే ఉంది. దీంతో ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగలకు కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పని చేసే (వర్క్ ఫ్రం హోమ్) అవకాశం కల్పించింది.
ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగుల పని వేళల్లో మార్పులు చేయాలని సలహా ఇచ్చింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ విజయ్ దేవ్ శనివారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులందరూ నూటికి నూరు శాతం కార్యాలయాలకు హాజరుకావాలని తెలిపారు. మిగిలిన సిబ్బందిలో 50 శాతం మంది అవసరాన్నిబట్టి కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు డిసెంబరు 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటాయన్నారు.
ప్రైవేటు సంస్థలు తమ పని వేళల్లో, సిబ్బంది హాజరులో మార్పులు చేసుకోవాలని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో గ్రేడ్ వన్, తత్సమాన స్థాయి అధికారులు నూటికి నూరు శాతం పని చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఢిల్లీ రెవిన్యూ మంత్రి కైలాశ్ గెహ్లాట్ కూడా ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీలో యాక్టివ్ కోవిడ్-19 కేసులు 38,181 ఉన్నాయి.