దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న రైతుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆపేస్తున్నారని, వారు ఈ దేశ వాసులు కాదన్నట్లుగా వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారందరూ పంజాబ్, హర్యానా నుంచి వచ్చారని, అయినా వారందరినీ ఖలిస్తానీలని అవమానిస్తున్నారని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశ రాజధానిలో భారీ ఎత్తున రైతులు నిరసనలు సాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో భారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుంటున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యనూ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. ఆందోళనలను నిరంకారి మైదానంలో కొనసాగించాలి ఆయన విజ్ఞప్తి చేశారు.