‘పెంగ్విన్’లాంటి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కీర్తి సురేశ్ నటిస్తోన్న చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానరపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. నవంబర్ 4 నుంచి ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలకానుంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ అమ్మాయి బిజినెస్ ఉమెన్గా ఎదగాలనుకునే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదర్కొంది. ధైర్యంతో తన లక్ష్యాన్ని ఎలా చేరకుంది? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక చిత్ర ట్రైలర్ అద్యాంతం ఆకట్టుకునేలా రూపొందించారు. సంయుక్త పాత్రలో కీర్తి నటన బాగుంది. ఒక బలమైన వ్యాపారవేత్తను ఎదుర్కొనే పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది. ఒక మహిళ వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఏంటి అన్న సమాజ మూస ప్రశ్నలకు బదులిస్తూ.. విదేశాల్లో భారతీయ టీ వ్యాపారాన్ని ప్రారంభించే అమ్మాయి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక టీజర్ చివరిలో ‘మిస్ ఇండియా అంటే నేను కాదు.. ఒక బ్రాండ్’ అని కీర్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.