తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు భేటీ అవ్వనున్నారు. ఈనెల 6వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సీఎంలు కేసీఆర్, జగన్లు సిద్ధమయ్యారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ సమక్షంలో ఈ భేటి జరగనుంది.
కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ భేటీలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు ముఖ్యమంత్రులు రెడీ అయ్యారు. అపెక్స్ కౌన్సిల్లో వినిపించాల్సిన వాదనలపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులతో చర్చించారు. తెలంగాణ తీసుకుంటున్న నిర్ణయాలపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడనున్నారు. ఇది కొత్త ఆయకట్టు కోసం చేపడుతున్నది కాదని ఏపీ చెబుతోంది. తమకు కేటాయించిన నీటి వాటాకు మించి ఏమీ ఎక్కువగా వాడుకోవడం లేదని ఏపీ అంటోంది. ఇదే విషయాన్ని స్పష్టం చేయనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గా ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని స్పష్టంగా కేంద్రం ముందుం ఉంచాలని భావిస్తోంది. నీటి వాటాలపై తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్దమని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
మరి ఈ వివాదానికి ఫులిస్టాప్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాలు కొద్ది రోజులుగా అపెక్స్ కౌన్సిల్ భేటీ కోసం ఎదురుచూస్తున్నాయి. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సమావేశం ఇప్పుడు జరగనుంది. మరి ఈ భేటీలో ఏం జరుగుతుందో చూడాలి.