ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతిపై వైసీపీ మాట్లాడిందని.. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా అవినీతి జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పేరిట అవినీతి జరుగుతోందన్నారు. పేద ప్రజల పొట్టగొట్టడంలో తెలుగుదేశం, వైసీపీకి తేడా ఏమాత్రం లేదన్నారు. జరుగుతున్న భూ అక్రమాల్లో సీఎం హస్తం ఉందన్నారు. తమ మాట వినడం లేదని అధికారులను బదిలీలు చేస్తున్నారన్నారు.
ఇక దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఏపీలో భారీగా ఇళ్లను మంజూరుచేశారని కన్నా అన్నారు. గృహ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 4వేల కోట్లను ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇళ్లు నిర్మించారని.. నిర్మాణాలు పూర్తైన వాటిని పేద ప్రజలు అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పూర్తి చెయ్యాలన్నారు.