నీ ఇల్లు బంగారం కానూ అన్నట్లు.. ఇప్పుడు నిజంగా బంగారం ఉన్న ఇళ్ల వారికి అదృష్టం వరించినట్లే. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరే ఇందుకు నిరద్శనం. తాజాగా అనుకున్నట్లుగానే రూ. 50వేలు దాటేసింది పసిడి ధర.
చూస్తుండగానే బంగారం ధర ఆకాశాన్నంటింది. నేడు చరిత్రలో మొదటిసారి పది గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్ దాటింది. అయితే కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. నేడు అనూహ్యంగా రూ. 50వేలు దాటేయడంతో ప్రజలు అవాక్కయ్యారు. కాగా అంతర్జాతీయంగా బంగారం ధర తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరింది. 2011లో బంగారం ఔన్సు ధర 1911 డాలర్లుంది.
డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గుతూ వస్తుండటమే దేశంలో బంగారం ధర ఎక్కువవ్వడానికి కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడ్ ప్రకటించడంతో డాలర్ విలువ తగ్గిపోయింది. పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టడమే మంచిదని భావిస్తుండటం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణంగా ఉంది. ఇక కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరిన్ని ఉద్దీపన పథకాలు ప్రకటించే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం పెరుగనున్నట్లు తెలుస్తోంది.