ఏపీ రాజధానిపై జనసేన స్వరం పెంచుతోంది. రాజధాని రైతులకు అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తామని.. రాజధాని వికేంద్రీకరణను కాదన్నారు.
రాష్ట్ర గవర్నర్ వద్దకు వెళ్లిన పాలనా వికేంద్రీకరణ, సి.ఆర్.డి.ఏ రద్దు బిల్లులపై గవర్నర్ అన్ని కోణాల్లో ఆలోచించాలని పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందన్నారు. రాజధానికి భూములు త్యాగం చేసిన వారి గురించి ఆలోచించాలన్నారు.
రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై గవర్నర్ ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఇటు అమరావతి రైతు ఐక్య కార్యచరణ సమితి సైతం రాజధాని విషయంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని కోరిన విషయం తెలిసిందే. ఇక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపుల్లో ప్రభుత్వ వైపల్యాలపై జనసేన..బీజేపీ కలిసిన నిరసన చేపట్టాయి. ఈ విషయంలో లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు ఇరు పార్టీలు కలిసి పోరాడుతాయన్నారు.