ఈ మధ్యకాలంలో నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేస్తోంది నటి కంగనా రనౌత్. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య తర్వాత మొదలైన ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ముంబై నగరం పిఓకేను తలపిస్తుంది అంటూ.. కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబైలోని కంగనా ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ
బీఎంసీ అధికారులు కూలగొట్టారు. దీంతో కంగనా ముంబై ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్ర గవర్నర్ ను కలవడానికి సిద్ధమవుతోంది.
ఈరోజు (ఆదివారం) సాయంత్రం నాలుగున్నర గంటలకు కంగనా గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ను కలవనుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ గవర్నర్ తో ఏం మాట్లాడనుందన్న దానిపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూలగొట్టడం పై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీనీ వివరణ అడిగారని సమాచారం. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.