ఏపీలో ఆలయాల భద్రతపై రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక సూచనలు చేశారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. దీంతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
అన్ని జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయాల పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పటిష్టమైన భద్రత ఉండాలన్నారు. దేవాలయాల కమిటీల సభ్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
మొన్న అంతర్వేదిలో రథం దగ్దమైన విషయంపై ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేందుకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ వేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీస్ శాఖ తరుపున ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఓ అంచనాకు పోలీసు ఉన్నతాధికారులు వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలని డీజీపీ చెప్పారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని కోరారు.
ఇక సోషల్ మీడియాపై కూడా ఆయన పలు కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తూ ఉండాలని చెప్పారు. పలువురు రెచ్చగొట్టేలా వార్తలు రాసే అవకాశం ఉందన్న కోణంలో ఇలా మాట్లాడారని తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.