కరోనా కేసులతో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కరోనాకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఓ జర్నలిస్టుకు ఏకంగా జైలు శిక్ష పడింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. విషయం బయటకు రిలీజ్ అవ్వడంతో అందరూ దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఝాంగ్ జాన్ అనే మహిళా జర్నలిస్ట్.. ఊహాన్లోని వాస్తవ పరిస్థితులపై వార్తలు రాయడంతో ఆమెను నిర్బంధించింది. ఝాంగ్ జాన్తో పాటు మరో ముగ్గురు జర్నలిస్టులను కూడా అదుపులోనికి తీసుకుంది. అయితే వీరందరినీ ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే అరెస్టు చేసింది. ఆ తరువాత చెన్ క్విషి, లి జెహువా అనే ఇద్దరు జర్నలిస్టులను విడుదల చేసినా.. మిగతా ఇద్దరిని మాత్రం అదుపులోనే ఉంచుకున్నారు. తాజాగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమంచినందుకు గానూ ఝాంగ్ జాన్కు అక్కడి కోర్టు 4ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే నాలుగో జర్నలిస్ట్ పరిస్థితేంటనేది ఇప్పటికీ తెలియరాలేదు.
తమదేశంలోని కరోనా కేసులను చైనా ఎప్పుడూ గోప్యంగా ఉంచుతూనే వస్తుంది. అయితే ఇదే సమయంలో కేసులకు సంబంధించిన విషయాలు ఎవరైనా బయటపెట్టాలని చూస్తే కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు కూడా ఇందుకు ఓ ఉదాహరణగా మేధావులు చెబుతున్నారు. ఇక జర్నలిస్టుల పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరుకు ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా సమాధానం వస్తుందో చూడాలి.