ఏపీలో వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరైన జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఆయన బెదిరించారు. మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన సీఐకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరోసారి ఆయన వార్తల్లోకెక్కారు.
ఏం జరిగిందంటే.. ముచ్చుకోటలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మైనింగ్పై అధికారులు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో జేసీ మైనింగ్ ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. అంతటితో ఆగకుండా అక్కడకు వచ్చిన పోలీసులను హేలన చేసి మాట్లాడారు. జేసీ దివాకర్ రెడ్డితో మాట్లాడేందుకు సీఐ తేజోమూర్తి అక్కడకు వచ్చారు. దీంతో జేసీ తన ఓన్ లాంగ్వేజ్ ఉపయోగించారు.
సీఐతో మాట్లాడుతూ మీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చారు. తన అనుచరులు రాక్షసులు అన్న జేసి.. టిడిపి అధికారంలోకి వస్తే రెచ్చిపోతారని బెదిరించారు. భవిష్యత్తు పాడుచేసుకోవద్దని పోలీసులకు చెప్పారు. జేసీ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చీనీయాంశమయ్యాయి. ఇటీవల సైలెంట్ అయిన జేసీ మళ్లీ ఇప్పుడు మాటల దాడి ప్రారంభించారు. కాగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విధుల్లో ఉన్న సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.