అనంతపురం నగరంలో తాము నిర్మించాలనుకుంటోన్న పార్టీ కార్యాలయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 10న అనంతపురంలో జరిగిన జనసేన బహిరంగ సభలో తాను మాట్లాడుతూ జిల్లాలో పార్టీ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని, అది నెరవేరే రోజులు సమీపిస్తున్నాయని పవన్ కల్యాణ్ అందులో పేర్కొన్నారు.
అనంతపురంలోని గుత్తి రోడ్డులో రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటు కాబోతుందని పవన్ తెలిపారు. ఈ కార్యాలయాన్ని విజ్ఞాన భాండాగారంగా, మేథావుల చర్చలకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని తాను మరోసారి సవినయంగా తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.