విజయవాడ దుర్గ గుడిలోని రథంలో మూడు సింహాలు మాయమైన విషయం తెలిసిందే. విషయం బయటకు రావడంతో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ జనసేన పార్టీలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నాయి.
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడలోని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు జనసేన నేతలు కార్యకర్తలు వెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన నేతలు, పోలీసులకు మధ్య తోపుసులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జనసేన నేత పోతిన మహేష్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధికార పార్టీ నేతలు మూడు సింహాల విషయంలో విచారణను పక్కదారి పట్టిస్తున్నారని జనసేన ఆరోపించింది. చనిపోయిన దుర్గారావు అనే వ్యక్తిపై కేసును మల్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈవో సురేష్ బాబు మూడు సింహాలను తీసుకెళ్ళి మంత్రి వెలంపల్లికి ఇచ్చారని ప్రచారం జరుగుతోందన్నారు. వెండి సింహాలను పూజిస్తే మంచి జరుగుతుందని వెలంపల్లి వాళ్ళ ఇంట్లో తాంత్రిక పూజలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనలో ఈవో నురేష్ బాబు నుంచే విచారణను ప్రారంభించాలన్నారు. మంత్రితో పాటు ఈవోపై చర్యలు తీసుకునేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని జనసేన నేతలు తెలిపారు.