అవసరాన్ని బట్టి ప్లేట్ మార్చేయడంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పేరొందిన నాయకుడని ఆయన గురించి తెలిసిన ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఇప్పుడు ఆయనే స్వయంగా దీన్ని నిరూపించుకుంటున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తే.. ఇప్పుడు దాన్ని అడ్డుకోవడంతో పాటు కొత్త వాదనకు తెరలేపుతున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. ప్రజల్లో భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన జగన్.. ఏడాదిన్నర పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయితే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదన్న ఆరోపణల నేపథ్యంలో వై.ఎస్ జగన్ సర్కార్ విచారణ చేసేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని టిడిపి శ్రేణులు కోర్టులను ఆశ్రయించి విచారణను ఆగిపోయేలా చేశారు. ఇందులో ప్రధానంగా వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్లు కోర్టును ఆశ్రయించి విచారణ ఆపాలని కోరారు.
అయితే ఈ పిటిషన్లను విచారించిన కోర్టు కూడా కేసు దర్యాప్తును ఆపాలని, ఎఫ్.ఐ.ఆర్ నివేదికను కూడా బహిర్గతం చేయడానికి వీళ్లేదని తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. దీంతో అమరావతి కుంభకోణంపై ఏసీబీ, సిట్ దర్యాప్తులు, మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల చర్యలపై విచారణ ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అధికార పార్టీ పార్లమెంటులో ఏపీ హైకోర్టు ఇస్తున్న తీర్పును ప్రస్తావించి చాకచక్యంగా ముందుకు వెళుతోంది. అయితే ఇదే టైంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం పదహారు నెలల పాలనపై సీబీఐ దర్యాప్తు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఇలా కొత్త వాదన తెరమీదకు తీసురావడం బాబుకే చెల్లిందని పొలిటికల్ డిస్కషన్ నడుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళుతుందన్న కారణంతోనే చంద్రబాబు ఇలా కొత్త వాదన మొదలు పెట్టారని అంటున్నారు. అయితే చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా కచ్చితంగా సుప్రీంకోర్టు విచారణకు అనుమతి ఇస్తుందన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఒక వేళ అలా జరగకపోతే చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ పాలనపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని కోరింది. మొత్తం మీద కోర్టులో విచారణ జరిగినా జరగకపోయినా సీబీఐ విచారణ అయినా చంద్రబాబు ఎదుర్కోక తప్పదని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.