ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో కీలక విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి అన్ని విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్ షాతో స్పష్టంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ముందుగా అమిత్షా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం రాష్ట్రంలో జరిగిన అమరావతి భూకుంభకోణం విషయం గురించి జగన్ వివరించినట్లు సమాచారం. దీంతో పాటు ఇటీవల వివాదం రాజుకుంటున్న మత విషయాలు కూడా ప్రస్తావించి అమిత్షాకు అసలు ఏం జరుగుతోందో వివరించి ఉంటారని చెబుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాల వ్యవహారశైలి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. విభజన హామీలు, మూడు రాజదానులు, పెండింగ్ నిధులు, ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై స్పష్టంగా చర్చించి ఉంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించినట్లు, దీంతో పాటు అమరావతి, ఫైబర్ నెట్ స్కాంల్లో కూడా సీబీఐ విచారణ విషయం ముందుకు తీసుకెళ్లినట్లు తెలిసింది.
అయితే జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఏపీకి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అన్నీ పరిశీలించాక కొవ్వాడను ఎంపిక చేశారు. 1208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రకటనతో సీఎం ఢిల్లీలో ఉండగానే ఏపికి మంచి ఫలితాలు వస్తున్నాయని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.