అమరావతిలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంలో ముందుంటామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి రైతుల దీక్ష 300 రోజులకు చేరిన నేపథ్యంలో ఆయన పెనుమాకలో రైతులు, మహిళలకు సంఘీబావం తెలిపారు. అమరావతిని చంపేందుకు ప్రభుత్వం, వైసీపీ నేతలు కుట్రపన్నుతున్నారన్నారు.
చంద్రబాబు పిలుపుతో రైతులు స్వచ్ఛందంగా ఏపీ రాజధాని కోసం భూములిచ్చారని లోకేష్ గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అమరావతిని చంపేశారని అన్నారు. రైతులను, మహిళలను కించపరుస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయని, విజయం మనదేనని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో అనేక కంపెనీలు విశాఖకు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అయితే జగన్ సీఎం అయ్యాక పరిశ్రమలు ఏపీ నుంచి తరలి వెళ్లిపోయాయని విమర్శించారు. గత 17 నెలల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని వదిలేసి.. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ ముందుకెళ్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. విశాఖలో భూకబ్జాలు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. కాగా ఇన్నాళ్లు హైదరాబాద్లో ఉన్న లోకేష్ ఇప్పుడు బయటకొచ్చి ఒకేసారి ప్రభుత్వంపై దాడి చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను, పార్టీని వదిలేసి పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారా అంటున్నారు.